ట్రక్కుని ఢీకొన్న కారు ఆరుగురి దుర్మరణం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హర్యానాలోని భివానీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని షేర్లా గ్రామ సమీపంలో రహదారిపై నిలిపి ఉంచిన ట్రక్కును కారు ఢీకొట్టంతో ఆరుగురు మరణించారు. మృతుల్లో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురితో పాటు  ట్రక్కు డ్రైవర్ కూడా ఉన్నారు. ట్రక్కు నిలిపిన తర్వాత అక్కడే నిల్చుకున్న డ్రైవర్‌ను కూడా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారంఅందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని.. ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు.  కారులో ఉన్న ఐదుగురిని బుధారా నివాసి నసీబ్, వికాస్, లాడియాలికి చెందిన ప్రదీప్, భివానీలోని ఇడివాలికి చెందిన రవి, హిసార్‌లోని బర్వాలాకు చెందిన జితేందర్‌గా గుర్తించారు. ఇక, లారీ డ్రైవర్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ట్రక్కును ఎలాంటి ఇండికేటర్ లేకుండా పార్క్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఇండికేటర్ లేకపోవడంతో అతివేగంతో వచ్చిన కారు.. ట్రక్కును గుర్తించకుండా ఢీకొట్టినట్టుగా అనుమానిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.