అంతుచిక్కని వ్యాధికి ఓ కుటుంబం బలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అంతు చిక్కని వింత వ్యాధి ఆ కుటుంబాన్ని బలిగొంది. ఆ ఇంటి చుట్టు ఎన్నో ఇళ్లు, జనం ఉన్నా ఒకే కుటుంబంపై మాయదారి మహ్మమారి పంజా విసురుతోంది. బిడ్డ, కొడుకును కబలించిన వింత రోగం ఇటీవల తల్లిని, నిన్న తండ్రిని అంపశయ్యపైకి చేర్చింది. నిండు ప్రాణాలను బలిగొంటున్న వింత రోగం ఏంటో తెలియక గ్రామస్తులు, బాధిత కుటుబం లబోదిబోమంటున్న తీరు అందరిని కంటతడి పెట్టిస్తుంది.

బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మండల కేంద్రమైన గంగాధరకు చెందిన వేముల శ్రీకాంత్ కుటుంబం అంతు చిక్కని వింత వ్యాధి భారిన పడింది. కొన్నేళ్ల నుంచి వాగు ఒడ్డుకు గల ఇంట్లో భార్య మమత, బిడ్డ అమూల్య, కొడుకు అద్వైత్తో శ్రీకాంత్ కుటుంబం ఎంతో హాయిగా జీవిస్తోంది. ఓ ప్రయివేట్ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తూ వచ్చిన జీతంతో ఆనందంగా గడుపుతున్న శ్రీకాంత్ కుటుంబపై అంతు చిక్కని వింత వ్యాధి కన్నెర్ర చేసింది. దీంతో రెండేళ్లు నిండని చిన్నారి, శ్రీకాంత్ తనయుడు వేముల అద్వైత్ వాంతులు, విరేచనాలతో అవస్థ పడగా, ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ చిన్నారి బాలుడు అద్వైత్ నవంబర్ 16వ తుదిశ్వాస వదిలాడు. తనయుడి మరణంతో శ్రీకాంత్ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారు.

కొడుకును కోల్పోయిన నాడు నుండి నాలుగేళ్లు నిండని అతని కుమారై వేముల అమూల్య అదే వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి కూడా డిసెంబర్ 4న కన్నుమూసింది. నెల వ్యవధిలో కంటికిరెప్పలా కాపాడుకున్న చిన్నారులిద్దరు ప్రాణం వదలడంతో శ్రీకాంత్, అతని భార్య మమత, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రాణాలు కోల్పోయిన అద్వైత్ అమూల్యను వింత వ్యాధి బలిగొనగా..శ్రీకాంత్ కుటుంబంలో కన్నీటి ధారలు కదలాడుతుండగా..మరో విషాదం అలముకుంది.

బిడ్డ, తనయున్ని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న శ్రీకాంత్, అతని భార్య మమత చిన్నారుల కర్మకాండలు పూర్తి చేసుకుని ధర్మపురి గంగ స్నానం ఆచరించి ఇంటికి చేరారు. అంతలోనే మమత తన కొడుకు, బిడ్డ ప్రాణం తీసిన వింత వ్యాధి రూపంలో ఉన్న వాంతులు, విరేచనాలే తనను చుట్టు ముట్టాయి. బిడ్డ, తనయున్ని కోల్పోయిన దిగులో ఉన్న శ్రీకాంత్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన భార్య మమతను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు డిసెంబర్ 19నాడు మరణించింది. భార్య మరణించి పది రోజులు కాకముందే ఈరోజు ఉదయం భర్త శ్రీకాంత్ కూడా నోటి నుండి రక్తం కక్కుకొని ఉదయం 5 గంటలకు మరణించాడు.

అంతుచిక్కని వ్యాధితో ఒకే కుటుంబంలో ఒక్కొక్కరు మృతి చెందిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఉన్నట్టుండి రాత్రి రాత్రి శ్రీకాంత్ రక్తం కక్కు చనిపోవడం వెనుక అసలు ఏమై ఉంటుందని..గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. శ్రీకాంత్ సూసైడ్ చేసుకున్నాడా..లేక ఎవరైనా చంపేశారా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. శ్రీకాంత్ అత్తగారు శ్రీకాంత్ పై అనుమానం ఉందంటూ పోలీస్ స్టేషన్లో కేసు వేసిన నేపథ్యంలో శ్రీకాంత్ భయపడి సూసైడ్ చేసుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.