కూతుర్ని అతి కిరాతకంగా హతమార్చిన తండ్రి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

నవతెలంగాణ- పెబ్బేరు
కూతురు గ్రామంలో ఓ యువకున్ని ప్రేమించి తమ కుటుంబం పరువు తీస్తోందని అవమానంగా భావించిన తండ్రి.. మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. బాలిక గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌-సునీత దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. గీత(15) రెండో కూతురు. పెబ్బేరు జడ్పీహెఎస్‌లో 10వ తరగతి చదివేది. కొద్ది రోజులుగా పాతపల్లి గ్రామానికి చెందిన ఓ యువకునితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోందని సమాచారం. ఈ విషయం గ్రామమంతా పాకడం.. చివరకు కొందరు తండ్రికి చెప్పడంతో అవమానంగా భావించి బాధపడ్డాడు. రెండు మూడుసార్లు కుమార్తెను మందలించాడు. అయినా ఆమె వినలేదు. దీపావళి పండుగ కోసం కుటుంబ సభ్యులందరూ ఆదివారం వనపర్తి మండలం చందాపూర్‌లో బంధువుల ఇంటికెళ్లారు. సోమవారం సాయంత్రం రాజశేఖర్‌, గీత ఇద్దరూ కలిసి పాతపల్లికి వచ్చేశారు. రాత్రి సమయంలో కూతురు బయటికి వెళ్లి త్వరగా రాకపోవడంతో అనుమానం వచ్చి కొంతసేపు వెతికాడు. తరువాత కనిపించడంతో ఇంటికి తీసుకెళ్లి కొట్టాడు. మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఊర్లో గ్రామస్తులు పలు రకాలుగా అనుకుంటున్నారని, తీవ్ర మనస్తాపం చెందిన రాజశేఖర్‌ మద్యం సేవించాడు. ఆ మత్తులోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో గీత కాళ్లు, చేతులు కట్టేసి గొంతు, చెవి, మెడ కింద పొడిచాడు. అనంతరం పొలానికి వెళ్లిపోయాడు. గ్యాస్‌ సిలిండర్‌ కోసమని బయటికి వెళ్లి తిరిగి వచ్చిన రాజశేఖర్‌ తల్లి ఇంట్లోకి వచ్చేసరికే గీత రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కేకలు వేసింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్‌ఐ రామస్వామి, కొత్తకోట ఇన్‌చార్జి సీఐ కె.ఎస్‌ రత్నం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీంను పిలిపించి వివరాలు సేకరించారు. రాజశేఖర్‌ను వెంటనే అదుపులోకి తీసుకొని పెబ్బేరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వనపర్తి డీఎస్పీ ఆనందరెడ్డి అక్కడకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. తండ్రే కుమార్తెను హత్య చేసినట్టు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.