ఆడబిడ్డే పుట్టిందన్న కోపంతో పసికందు నోట్లో పొగాకు కుక్కి కిరాతకంగా హత్య
- మహారాష్ట్రలో దారుణం.. కన్న తండ్రే కాలయముడయ్యాడు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిది రోజుల పసిబిడ్డ పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. మళ్లీ ఆడబిడ్డే పుట్టిందన్న కోపంతో పసికందు నోట్లో పొగాకు కుక్కి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశాడు. ఆశా కార్యకర్త ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. జల్గావ్ జిల్లాలోని పహూర్ పోలీస్స్టేషన్ పరిధిలోగల హరినగర్ తండాలో గోకుల్ జాదవ్ (30) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. జాదవ్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలున్నారు. తాజాగా మూడో కాన్పులో కూడా ఆడబిడ్డే పుట్టడంతో జాదవ్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో కన్న మమకారాన్ని కూడా మరిచిపోయి దారుణంగా చిన్నారి నోట్లో పొగాకు కుక్కి చంపేశాడు.అయితే, బిడ్డ పుట్టిందనే విషయం తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త జనన నమోదు కోసం తండాకు వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లాక పాప మరణించిందని తెలిసింది. ఎలా మరణించిందని ఆరా తీయగా ఆమె తండ్రే నోట్లో పొగాకు కుక్కి చంపిన విషయం బయటపడింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.