కట్నం సరిపోక పెళ్లి రద్దు చేసుకున్న అమ్మాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  కట్నం సరిపోలేదంటూ చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయిలను ఇంతకుముందు అనేక మందిని చూశాం. పీటల మీద పెళ్లి ఆగిపోతే, అమ్మాయి పరిస్థితి ఎలా అని కంగారు పడ్డ ఉదంతాలను చూశాం. కానీ, ఇప్పుడు కాలం మారింది. సీన్ రివర్సైంది. కట్నం సరిపోలేదని ఓ అమ్మాయి.. చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకుంది. వరుడి కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ. 2 లక్షలు కట్నం ఇచ్చేలా పెద్దల సమక్షంలో అంగీకారం కుదిరింది. శుభలేఖలు పంచుకున్నారు. గురువారం రాత్రి 7.21 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు, కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు.

ముహూర్తానికి సమయం దగ్గర పడుతున్నా.. వధువు, వారి కుటుంబసభ్యులు ఎవరూ రాకపోవడంతో అబ్బాయి తరఫు బంధువులు ఆందోళనకు గురయ్యారు. అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏమైందని ఆరా తీయగా.. తనకు అబ్బాయి వాళ్లు ఇచ్చే కట్నం సరిపోదని, అదనంగా డబ్బు కావాలని వధువు డిమాండ్‌ చేసింది. పెళ్లి ముహూర్త సమయానికి గంట ముందు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పేసింది. చేసేదేంలేక వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. అక్కడ రాజీ కుదిర్చే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.