ఆదిలాబాద్ జిల్లాలో కొత్త అలజడి.. కలకలం రేపుతున్న మత్తు ఇంజక్షన్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త అలజడి మొదలైంది. ఇచ్చోడలో సూదిపోటు దడ పుట్టిస్తోంది. సిరెంజ్ పేరు చెప్తేనే హడలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే చిన్న సైజు సిరంజితోనే క్రైమ్క తెగబడుతున్నారు కేటుగాళ్లు.

జిల్లాలోని ఇచ్చోడ మండలంలో మత్తు ఇంజెక్షన్ కలకలం రేపుతోంది. హరినాయక్ తాండాలో జరిగిన ఓ ఘటన అందరిని వణికిస్తోంది. బస్టాండ్లో నిల్చున్న 22 ఏళ్ల శ్రీకాంత్ అనే యువకుడికి ఓ ఇంజెక్షన్ పొడిచి.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారు. బైక్ మీద వచ్చిన వీళ్లు ఎక్కడి నుంచి వచ్చారు. ఎందుకు ఇంజెక్షన్ పొడిచారో తెలియదు. అది అసలు ఏం ఇంజెక్షనో కూడా అక్కడున్న వారికి అర్ధం కాలేదు. కానీ శ్రీకాంత్ మాత్రం కొన్ని క్షణాల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

అచేతనంగా పడి ఉన్న యువకుడిని చూసి స్థానికులు 108కి కాల్ చేసి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. శ్వాస తీసుకోవడంలో శ్రీకాంత్ ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే రిమ్స్ కు తరలించారు. తమ కుమారుడికి ఎమయ్యిందో అర్ధం కాక.. ఆ కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది. దాడికి పాల్పడిన వ్యక్తులు స్థానికులు కాదని వారిని ఎప్పుడు అక్కడ చూడలేదని చెబుతున్నారు స్థానికులు.

ఇటీవల కాలంలో మత్తు ఇంజెక్షన్లలో హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ వార్త ఆనోట ఈ నోట ప్రచారం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ మీద వచ్చి శ్రీకాంత్ పై ఎందుకు దాడి చేశారు? వారు ఎవరు? ఎందుకు దాడికి పాల్పడ్డారు? లేదా పాత కక్షలేమన్నా ఉన్నాయా?ఏమి ఆశించి ఈ దాడి చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.