‘జై తెలుగు పార్టీ’ పేరుతో  ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావం..

- తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో వచ్చే ఎన్నికలలో పోటీ: జొన్నవిత్తుల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో చడీ చప్పుడు లేకుండా ఓ కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎలాంటి హంగామా లేదు. కనీసం ఒక చిన్న ప్రకటన కూడా లేకుండా కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరు ఇంచుమించు తెలుగుదేశం పార్టీ మాదిరిగానే ఉంది. తెలుగు వాడి ఆత్మగౌరవం పేరుతో నాడు ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే.. ఇప్పుడు తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు. తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నానని జొన్నవిత్తుల పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. వారిని చైతన్య వంతులుగా చేయడానికే ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయిందని జొన్నవిత్తుల అన్నారు. భాషా, సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయిందన్నారు. ఈ‌ విలువల కోసం రాజకీయ నాయకులు, ప్రజలు పని‌చేయాలన్నారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించానని జొన్నవిత్తుల తెలిపారు. నీలం రంగు జలం, పచ్చ రంగు వ్యవసాయం, ఎరుపు రంగు శ్రమశక్తి, పసుపు వైభవానికి చిహ్నం, తెలుపు జల వనరులు స్వచ్ఛంగా ఉండాలన్నారు. వెనుక తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్షగా జొన్నవిత్తుల చెప్పుకొచ్చారు. తెలుగు భాష కోసం ఐదుగురు ‌మహనీయులు కృషి చేశారని.. త్యాగాలు చేశారని వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి యన్టీఆర్‌ చిత్రాలు తన జై తెలుగు రాజకీయ జెండాలో, ఎజెండాలో ఉంటాయన్నారు.తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వారు ఎందరో ఉన్నా.. ఈ ఐదుగురు ముందు వరుసలో ఉంటారని జొన్నవిత్తుల అన్నారు. మన భాషా సంస్కృతి వైభవం గురించి నేడు ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నాడు మదరాసీలు అన్నారని.. నేడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామన్నారు. కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామన్నారు. మన భాషను మనమే విస్మరించి చులకన చేసుకున్నామని జొన్నవిత్తుల పేర్కొన్నారు. తెలంగాణ భాష మొత్తం ఒక్కటే.. ఏపీలో మాత్రం ప్రాంతాల వారీగా భాష మారిపోతుందన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు, రాయలసీమ ఐదు రకాల భాషలు ఏపీకి ఉన్నాయన్నారు. తెలుగు భాషకు పునర్వైభవాన్ని తీసుకురావాలనేదే తన సంకల్పమన్నారు. మన భవిష్యత్తు తరాలకు మన తెలుగు భాషను అందించాలన్నారు. లక్షల కోట్ల బడ్జెట్, అధికారం ఉన్న ప్రభుత్వాలు తెలుగు భాషకు సమున్నత స్థానం కల్పించాలన్నారు. మాతృ భాష పరిరక్షణ .. రాజకీయ నాయకుల బాధ్యత అన్నారు. ఆగస్ట్15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని జొన్నవిత్తుల ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.