రెస్టారెంట్ లో బాలున్ని కొరికిన ఎలుక

తెలంగాణాజ్యోతి/వెబ్ న్యూస్: ఆర్మీ అధికారి తన కుటుంబంతో కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళితే, అక్కడ ఊహించని అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తింటుండగా.. ఓ ఎలుక వచ్చి 8 ఏళ్ల బాలుడిని కొరికింది. ఏదో తన ఆహారమంతా దోచుకొని తింటున్నట్లు చిన్నారిని కసిగా కొరికేసింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒక్కసారిగా కుమారుడి అరుపులతో ఆందోళనకు గురైన తండ్రి.. బాలుడిని పక్కకు తీసుకొని, ఎలుకను లాగి పడేశారు. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స చేసి, యాంటీ రేబిస్, టెటానస్ టీకాలను వేశారు వైద్యులు. అనంతరం ఆయన పోలీసులను ఆశ్రయించారు. రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడికి ఈ పరిస్థితి వచ్చిందని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఎలుక కొరకడంతో బాలుడి కాలికి గాయమైంది. పన్ను గాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎలుక వాష్‌రూమ్ నుంచి రెస్టారెంట్‌లోని సిట్టింగ్ ఏరియాలోకి వచ్చింది. ఘటన జరిగినప్పుడు 8 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో ఉన్నాడు. ఎలుక బాలుడి షార్ట్‌పైకి ఎక్కడంతో, అతడి తండ్రి అతణ్ని రక్షించడానికి ముందుకు దూకి, పిల్లవాడి షార్ట్‌లో నుంచి ఎలుకను తీసి దూరంగా విసిరేశారు.ఈ ఘటన మార్చి 8న చోటు చేసుకుంది. మరుసటి రోజు బాలుడి తండ్రి రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన కుమారుడిని ఎలుక కొరికిన తర్వాత కూడా రెస్టారెంట్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. చట్టపరంగా శిక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.