కేరళ కన్వెన్షన్ హాల్ లో వరుస పేరులు
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కేరళలోఆదివారం ఉదయం జరిగిన పేలుళ్ల ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్నాకుళంజిల్లా కాలామస్సెరిలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9.30 ప్రాంతాంలో వరుస పేలుళ్లుసంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడంతో కాలామస్సెరి నెస్ట్ సమీపంలోని కన్వెన్షన్ సెంటర్ లో క్రిస్టియన్ మతస్థులుప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రార్థనలకు వరపుజ, అంగమలి, ఎడపల్లి తదితర మండలాల నుంచి వందల సంఖ్యలో జనం తరలివచ్చారు. అదే టైంలో అకస్మాత్తుగా జనం మధ్యలో పేలుడు సంభవించింది. 5 నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని.. పేలుళ్ల ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందన్నారు. టిఫిన్ బాక్స్ లో పేలుడు పరికరాలు లభించినట్లు సమాచారం. బాధితుల ఆర్తనాదాలకు సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఇందులో ప్రాణాలు రక్షించుకోవడానికి బాధితులు పరిగెడుతుండటం కనిపిస్తోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం
ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని.. పేలుళ్లకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. డీజీపీతో పాటు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారని, సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఘటనకు కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సెలవులో ఉన్న వైద్యులతో సహా ఆరోగ్య కార్యకర్తలందరూ వెంటనే విధుల్లోకి రావాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు.