సిసోడియా కు ఎదురుదెబ్బ.. బెయిల్ నిరాకరించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు శుక్రవారంనాడు నిరాకరించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ఈనెల 24వ తేదీన సిసిడియా బెయిల్ అభ్యర్థనపై తీర్పును మార్చి 31వ తేదీకి వాయిదా వేశారు. శుక్రవారం తీర్పు వెలువరించారు.నిందితుడి రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ను వ్యతిరేకిస్తూ సీబీఐ లిఖిత పూర్వకమైన వివరాలు కోర్టుకు తెలియజేసిందని, కాపీ ప్రతిని నిందితుడి న్యాయవాదికి ఇవ్వడం జరుగుతుందని, కేసు డెయిరీ, సాక్ష్యుల వివరాలకు సంబంధించిన కాపీని కూడా అందుబాటులో ఉంచుతామని ప్రత్యేక న్యాయమూర్తి తెలిపారు.కాగా2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలు విషయంలో అవినీతికి ఆరోపణలపై సిసోడియాను ఇంతవరకూ ఏడు రోజుల పాటు సీబీఐ ప్రశ్నించింది. ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. దీంతో తీహార్ జైలుకు వెళ్లిన ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరైట్ మార్చి 9న అరెస్టు చేసింది. కాగా, సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 5వ తేదీ వరకూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. సిసోడియా బెయిల్ అభ్యర్ధనను సీబీఐ తిరస్కరిస్తూ వస్తోంది. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, ఈ కేసులో ఆయన తరచూ ఫోన్లు మార్చారని, అదేమీ అమాయకత్వం కాదని తెలిపింది. ఛార్జిషీటు దాఖలు చేయడానికి తమకు 60 రోజుల సమయం ఉందని, అప్పటివరకూ బెయిల్ ఇవ్వవద్దని గత విచారణలో కోర్టుకు సీబీఐ విన్నవించింది.