ఏపీ మాజీ మంత్రి రోజాకు షాక్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్‌ల పేరుతో అవకతవకలు జరిగాయని సీఐడీకి ఫిర్యాదు అందింది. క్రీడల పేరుతో అప్పటి మంత్రి ఆర్కే రోజా, శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవినీతికి పాల్పడ్డారని.. సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు.జగన్ సర్కార్ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో రాష్ట్రవ్యాప్తంగ ఆటలపోటీలు నిర్వహించారు. ఈ గేమ్స్‌కు సంబంధించి రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రసాద్ ఆరోపించారు.ఈ అవకతవకలపై సీఐడీ విచారణ కోరుతూ.. ఈ నెల 11న సీఐడీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన శాప్‌ ఎండీలు, శాప్‌ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీవోలపై విచారణ జరపాలని సీఐడీని కోరామన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు క్రీడాంశాల్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ పోటీలను నిర్వహించారన్నారు. క్రీడల నిర్వహణ కోసం కొనుగోలు చేసిన సామగ్రిలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు ప్రసాద్. నాసిరకం క్రీడా సామగ్రిని కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని విమర్శించారు.అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తప్పుడు నివేదికలు ఇచ్చి రూ. కోట్లు దోచేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ అవినీతిలో 26 జిల్లాల డీఎస్డీవోలు ప్రముఖ పాత్ర పోషించారని ఆయన చెప్పుకొచ్చారు.స్పోర్ట్స్ కోటా ద్వారా మెడికల్, ఇంజినీరింగ్, ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ సీజ్‌ చేయాలని ప్రసాద్ కోరారు. ఐదేళ్ల కాలంలో శాప్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో కూడా భారీగా అవకతవకలను కూడా పరిశీలించాలి అన్నారు. మాజీ మంత్రి రోజాపై ఏకంగా రూ.100 కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు రావడం కలకలంరేపుతోంది.

Leave A Reply

Your email address will not be published.