ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది అక్కడికక్కడే దుర్మరణం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: అతి వేగంతో వచ్చిన ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి మాంటేరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం వెనీస్‌ నుంచి మాంటేరాకు బస్సు బయల్దేరింది. రాత్రి 7 :30 గంటల ప్రాంతంలో వెనీస్‌ బ్రిడ్జిపైకి రాగానే అదుపుతప్పిన బస్సు కిందపడిపోయింది. 50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రిక్‌ వైర్లపై పడటంతో బస్సులో నుంచి మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. బస్సు తగలబడటంతో అందులోని ప్రయాణికులకు కూడా మంటలు అంటుకున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడినవారిని రెస్క్యూ సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చాలామంది క్షతగాత్రులను కాలిపోయిన దశలోనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. దీంతో మరణాల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ప్రమాదానికి ముందు బస్సు డ్రైవర్‌ అస్వస్థతకు గురై ఉంటారని వెన్నీస్‌ నగర కౌన్సిలర్‌ రెనాటో బోరాసో తెలిపారు. ఇక బస్సు ప్రమాదంపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.