సికింద్రాబాద్ స్టేషన్ లో అపహరణకు గురైన బాలుని ఆచూకీ లభ్యం
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: సికింద్రాబాద్ స్టేషన్లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని కిడ్నాపర్ మాదాపూర్లో వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు.మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపురానికి చెందిన దుర్గేశ్ బధిరుడైన తన ఐదేండ్ల కుమారుడితో కలిసి తిరుపతికి వెళ్లి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్కు దుర్గేశ్ చేరుకున్నాడు. ఆ సమయానికి తమ గ్రామానికి బస్సులు ఉండవని చెప్పి, అలసిపోయి రైల్వేస్టేషన్లో ఉండిపోయాడు. తన వస్తువులను, కుమారుడిని ఒకటో నంబర్ ప్లాట్ ఫాం వద్ద ఉంచి దుర్గేశ్ శౌచలయానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. ఆందోళనకు గురైన తన కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, గుర్తు తెలియని దంపతులు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.