స్వదేశీ పరిజ్ఞానంతో..సెప్టెంబర్‌ 2న నింగిలోకి ఆదిత్య ఎల్‌-1 మిషన్‌..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చంద్రయాన్‌-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉత్సాహంతో మరికొన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టనున్నది. సెప్టెంబర్‌ 2న ఈ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మిషన్‌ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనున్నది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపడుతుండగా.. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది.ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్లనున్నది. ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనంలో చేయడంలో ఉపయోగపడనున్నాయి. ఆదిత్య ఎల్‌-1 పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో చేపడుతున్నది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి. ప్రయోగం కోసం రెండువారాల కిందటే పేలోడ్స్‌ ఏపీ శ్రీహరికోటలోని ఇస్రో స్పేస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి. వచ్చే నెల 2న ప్రయోగం జరిగే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.