అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తే తమ రికార్డులలో ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్పు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారత దేశం అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తే తమ రికార్డులలో ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చేందుకు అంగీకరిస్తామని యునైటెడ్ నేషన్స్ ( ఐక్యరాజ్యసమితి) తెలిపింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రధాన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేరు మార్పు కోసం భారతదేశం అన్ని లాంఛనాలు పూర్తి చేసి తమకు తెలియజేస్తే యూఎన్ రికార్డులలో ఆ మేరకు మార్పులు చేస్తామని తెలిపారు.కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 అతిథులను విందుకు ఆహ్వానించిన పత్రాల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ గా పేర్కొన్నారు. అలాగే మోదీని ‘భారత్ ప్రధాని’గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రతిపక్షాలతోపాటు పలు రంగాలకు చెందిన నిఫుణులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.