ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్..

.. టి 9 టికెట్ సేవలను నిలిపివేసిన ఆర్టీసీ సంస్థ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా T-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. రేపటి (ఆగస్టు 29) నుంచి నాలుగు రోజుల పాటు టికెట్లు నిలిపేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. ఆ సమయంలో T-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టంగా మారతుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుందని రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.ఈ నేపథ్యంలోనే T-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించిందని చెప్పారు. రేపటి (ఆగస్టు 29) నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుందన్నారు. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయని సజ్జనార్ ట్వీట్ చేశారు.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టి-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి T-9-60ని, 30 కిలో మీటర్ల పరిధిలో T-9-30ని అందుబాటులోకి తీసుకువచ్చింది. T-9-60 టికెట్‌ను రూ.100కు T-9-30ని రూ.50కి ప్రయాణికులకు అందజేస్తోంది.రాఖీ పౌర్ణమికి స్పెషల్ బస్సులు..రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదిల్లో ప్రతి రోజు 1000 బస్సుల చొప్పున నడపనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, గోదావరిఖని, మంచిర్యాల, నిజామాబాద్‌, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ తదితర రూట్‌లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు.ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ బస్ స్టేషన్‌లతో పాటు ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.