మాకు పొత్తులు ముఖ్యం కాదు..ప్రజలు ముఖ్యం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీ తో పొత్తు పెట్టుకున్నా.. ఎవరితో పొత్తు పెట్టుకున్నా నిరంతరం ప్రజల సమస్యల కోసమే పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావ్ అన్నారు. సోమవారం సీపీఐ పార్టీ పినపాక నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పేదల కోసమే కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని, వారి కోసమే పోరాడుతుందని.. ఇకపై పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే వందేళ్లయినా చెక్కుచెదరకుండా ఉందన్నారు. సమన్యాయం కోసమే కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించేవారే, ఎదురించేవారే కమ్యూనిస్టు అని తెలిపారు. రేపు రాబోయే ఎన్నికలకు పినపాక సమావేశం దిశా, నిర్ధేశంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మన వైపే చూడాలన్నారు. పినపాక నియోజకవర్గంలో సీపీఐ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ముందుండాలని… కమ్యూనిస్టు పార్టీ ఉంటేనే సమాజానికి రక్ష అంటూ కూనంనేని సాంబశివరావ్ పిలుపునిచ్చారు.