రంగంలో భవిష్యవాణి వినిపించిన అమ్మవారు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సికింద్రాబాద్ లష్కర్ బోనాల (Lashkar Bonalu) జాతరలో రెండో రోజైన సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. గతేడాది ఇచ్చిన వాగ్ధానాలు మరిచిపోయారని అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఒడిదొడుకులు ఉన్నా.. వర్షాలు కురుస్తాయన్నారు. అగ్ని ప్రమాదాలు జరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.”ఎలాంటి లోపాలు లేకుండా పూజలు జరిపించినందుకు సంతోషం. కానీ గతేదాది ఇచ్చిన వాగ్ధానాలు మరిచిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను. మీతోనే ఉంటాను. వర్షాలు తప్పకుండా వస్తాయి కానీ.. ఒడిదొడుకులు ఉంటాయి. అగ్ని ప్రమాదాలు కూడా జరగుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. నా వద్దకు వచ్చిన ప్రజలందరిని కాపాడుకుంటా. ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటా. నాకు ఐదు వారాల పాటు సాక పట్టండి. గడప గడపను కాపాడే బాధ్యత నాది. మీరు చేసిన క్రియలు, పూజలు నాకు తెలుసు. ఏది బయపెట్టాలో.. ఏది బయటపెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. మీరు ఏ పూజలు చేసినా.. సంతోషంగా, ఆనందంగా అందుకుంటున్నా. మీరు మాత్రం మర్చిపోకండి. వచ్చే ఏడాదికి ఇచ్చిన వాగ్ధానాలు పూర్తి చేయండి.” అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.అమ్మవారు అలా చెప్పటం సంతోషంగా ఉందిబోనాలు కార్యక్రమం బాగా జరిగిందని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పటం సంతోషంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంగం కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాసేపట్లో పోతరాజులు ఊరేగింపు, ఘటోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈసారి లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారన్నారు. రాత్రి వరకు దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుందని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.