భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక విజయం
..దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-ఎస్ రాకెట్ ప్రయోగం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి వెళ్లింది. హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్ను రూపొందించింది. విక్రమ్ సారాభాయ్ పేరుమీద దీనికి విక్రమ్-ఎస్ అని నామరకణం చేశారు. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు.ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది.