ఆంధ్రప్రదేశ్ కు మరో వందే భారత్ రైలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏపీలో మరో వందేభారత్‌ రైలు పట్టాలెక్కబోతోంది. విజయవాడ-చెన్నై మధ్య నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈనెల 7 నుంచి మొదలవుతుందని చెబుతున్నారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా మరో ఐదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తున్నారట.. ఈ రైలు ఈ నెల 8 నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ఉంటాయని చెబుతున్నారు.

విజయవాడ నుంచి చెన్నై మధ్య ఏయే స్టేషన్లలో స్టాప్ ఉంటుంది.. రాకపోకలకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌, టిక్కెట్‌ ధరలు వంటి మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ వందేభారత్‌ను రేణిగుంట మీదుగా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా చెన్నై వెళ్లి.. అదే మార్గంలో తిరిగి రానుంది. విజయవాడ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ఈ వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ రైలు ప్రారంభంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.ఏపీ మీదుగా ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ఓ రైలు నడుస్తుండగా.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు కొనసాగుతోంది. ఇప్పుడు మూడో రైలు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అయితే కొత్తగా పట్టాలెక్కనున్న రైలు విజయవాడ నుంచి ఏ, ఏ స్టేషన్‌లలో స్టాప్‌ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు స్టేషన్‌లలో స్టాప్‌లు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలుకు ఏ, ఏ స్టాప్‌లు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు షెడ్యూల్ విషయానికి వస్తే.. ఈ రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరుతుంది.. తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ వస్తుంది. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్‌లలో ఆగుతుంది. సికింద్రాబాద్ విశాఖ మధ్య నడిచే వందేభారత్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్‌లలో ఆగుతుంది.

Leave A Reply

Your email address will not be published.