ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసిన ఏపి హైకోర్టు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రైవేట్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు (AP High Court) సస్పెండ్ చేసింది. ప్రైవేట్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసేందుకు ఇన్స్పెక్షన్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో నెంబరు 192ను జారీ చేసింది. తనిఖీ నివేదిక రాష్ట్ర విద్యాశాఖకు అందచేయాలని అందులో ఆదేశాలు ఇచ్చింది. ఈ జీవోను జూనియర్ కళాశాలలు, ఒకేషనల్ జూనియర్ కళాశాలల సంఘాలు హైకోర్టులో సవాల్ చేశాయి. కమిటీని నియమించడం విద్యాచట్టం, ఇంటర్మీడియట్ యాక్ట్ నిబంధనలకు విరుద్దమని ముతుకుమల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. కళాశాలల్లో సౌకర్యాలు పరిశీలించేందుకే ఈ కమిటీని నియమించామని ఇంటర్ బోర్డ్ తరపు న్యాయవాది రాజరాజేశ్వర రెడ్డి వాదించారు. ఇరు వర్గాల వాదనల అనంతరం జీఓ చట్టానికి వ్యతిరేకంగా ఉందని హైకోర్టు సస్పెండ్ చేసింది.