పవన్ కల్యాణ్కు ఏపీ పోలీసులు నోటీసులు
తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర జరుగనున్నది. యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారని, దీనిపై తనకు సమాచారం అందిందంటూ పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు అయితే, ఏ ఆధారాలతో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. యాత్రపై దాడులు జరుగుతాయనే సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు ఇచ్చారనే సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు ఎస్పీ పేర్కొన్నారు.తాము ఇచ్చిన నోటీసులకు పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. దాడులకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వాలని, అంతేగానీ అసత్యపూరిత ప్రచారం చేస్తే అది సరికాదన్నారు. పెడనలో పవన్ కల్యాణ్ సభకు భారీ బందోబస్తు కల్పించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. తమ సమాచార వ్యవస్థ తమకుందని, పవన్ కంటే తమ నిఘా వ్యవస్థ బలంగా ఉందన్నారు.అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మచిలీపట్నంలో జనసేన భరోసా కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. పవన్ కల్యాణ్ చేపట్టిన విజయాత్రను ఎలైగానా అడ్డుకునేందుకు ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని ఆరోపించారు. అల్లరిమూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని, కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్నారని, సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.