2023 బడ్జెట్ లో కొన్ని కఠిన చర్యలు ఉండబోతున్నాయా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మరో వారం రోజుల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2023లో కొన్ని కఠిన చర్యలు ఉండబోతున్నాయా?.. మూలధన వ్యయాల్లో కోత ఖాయమా?.. ఆర్థిక సంవత్సరం 2024లో ఎదురవ్వబోయే ప్రతికూల పరిస్థితులకు సంసిద్ధతే ఇందుకు కారణమాఅనే ప్రశ్నలకు ఔననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి. బడ్జెట్ 2023లో మూలధన వ్యయాల వృద్ధి నెమ్మదించొచ్చునని రాయిటర్స్ సంస్థ పోల్‌లో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. పన్ను ఆదాయ వసూళ్లు అంచనాకు తగ్గట్టు లేకపోవడంతో మూలధన వ్యయాలకు బ్రేకులు పడొచ్చని విశ్లేషించారు. తత్ఫలితంగా అల్పాదాయ వర్గాలు గణనీయంగా ప్రయోజనం పొందుతున్న ఆహారంఫెర్టిలైజర్స్ సబ్సిడీల్లో కోత విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ నిధులు రూ.5 లక్షల కోట్ల కేటాయించొచ్చని అంచనావేస్తే 26 శాతం తగ్గుదలతో రూ.3.7 లక్షల కోట్లకు కుదించడాన్ని ఇందుకు కారణంగా చూపుతున్నారు. పోల్‌లో పాల్గొన్న ఆర్థికవేత్తలు ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే ఈ చర్యలు లక్షలాది మందిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

నెమ్మదించనున్న ప్రభుత్వ వ్యయాలు..

ఆర్థిక సంవత్సరం 2019-20 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండింతలకుపైగా మూలధన వ్యయాలను పెంచింది. ఇదే సమయంలో ప్రైవేటు పెట్టుబడులు కూడా గణనీయం పెరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం 2024లో ప్రభుత్వ పెట్టుబడుల వృద్ధి నెమ్మదించొచ్చని ఆర్థికవేత్తలు విశ్లేషించారు. రాయిటర్స్ పోల్‌లో పాల్గొన్న ఆర్థికవేత్తల్లో 39 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.7.5 లక్షల కోట్లు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024కు సంబంధించి స్వల్పంగా 17 శాతం పెరుగుదలతో రూ.8.85 లక్షల కోట్లుగా ఉండొచ్చని విశ్లేషించారు. అయితే ప్రైవేటు పెట్టుబడులు అంత ఆశాజనకంగా లేవు కాబట్టి ప్రభుత్వ పెట్టుబడులు ఎక్కువగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. 2014 నుంచి ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయని ప్రస్తావిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ప్రైవేటు రంగ పెట్టుబడులు మరింత తగ్గొచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలుఅంచనాలు ఎంతవరకు నిజమవుతాయో ఫిబ్రవరి 1 వరకు వేచిచూాడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.