50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త…!!

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యింది.దీంతో ఆయా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లయ్యింది.ఈ క్రమంలో తాయిలాలు, నగదు పంపిణీతోపాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా మొదలయ్యింది.ముఖ్యంగా నగదు, బంగారం ఇతర వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే.. వాటిని సీజ్‌ చేస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆధారాలు చూపిస్తేనే వాటిని తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు,వ్యాపారం,శుభకార్యాలు,ఇతర అవసరాలకు అధిక మొత్తంగా నగదు తీసుకెళ్తున్న వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఎన్నికల వేళ అభ్యర్థులు, ఓటర్లకు సీఈవో కీలక సూచనలు.తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున అధిక మొత్తంలో నగదు చలామణి విషయంలో ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అనుక్షణం తనిఖీలు చేస్తుంటారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో స్థానికంగా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే తీసుకెళ్తున్న నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమం. నిబంధనల ప్రకారం, రూ.50వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కేవలం నగదు మాత్రమే కాకుండా బంగారం, ఇతర ఆభరణాలు భారీస్థాయిలో తీసుకెళ్లినా ఇబ్బందేనని స్పష్టం చేస్తున్నారు.

సూచనలు.. సలహాలు….!!

1) ఒకవేళ రూ.50వేల కంటే ఎక్కువ నగదు తరలించాల్సి వస్తే.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలి.

2) ఆసుపత్రిలో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే.. రోగి రిపోర్టులు, ఆసుపత్రి రశీదులు, ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోవాలి.

3) ఏదైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే.. ఖాతా పుస్తకం లేదా ఏటీఎం చీటీ వంటివి తప్పనిసరిగా తమవద్ద పెట్టుకోవాలి.

4) వస్తువులు,ధాన్యం విక్రయం డబ్బు అయితే వాటికి సంబంధించిన బిల్లు చూపించాలి.

5) భూమి విక్రయించిన సొమ్ము అయితే వాటికి దస్తావేజులు చూపాలి.

6) వ్యాపారం, ఇతర సేవల కోసం డబ్బు వినియోగిస్తే తనిఖీల సమయంలో లావాదేవీల వివరాలను ఆధారాలతో అధికారులకు చూపించాలి.

7) ఎక్కువ మొత్తంలో నగదు లభ్యమైతే ఐటీ, జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు. వాటికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇస్తారు.

Leave A Reply

Your email address will not be published.