హైదరాబాద్ లో బోనాలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆషాడ మాసం జంటనగరాల బోనాల జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లు, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్లతో హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని దేవాలయాలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఆయా దేవాలయాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బక్రీద్కు కూడా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.