ఏ దేశానికైనా గురువులు వెలకట్టలేని ఆస్తులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆధునిక ప్రపంచం విసురుతున్న సవాళ్లకు దీటుగా విద్యార్థులను సన్నతం చేయాలంటే అన్ని విషయాలపై సదవగాహన ఉన్న, పరిపూర్ణ గురువు కావాలని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు. నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ దేశ సర్వతోముఖ వికాసమైన, యువతరం మీదే ఆధారపడి ఉంటుందని, దారి దీపాలుగా మారి యువతరాన్ని చేయి పట్టుకుని సరైన తోవలో నడిపించే గురువులు, ఏ దేశానికైనా వెలకట్టలేని ఆస్తి అని లిల్లీ మేరి అన్నారు. సమస్య పరిష్కారము, భావవ్యక్తీకరణ, సమన్వయ సాధన, సృజనాత్మకత వంటి కొత్త తరం నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించాలని లిల్లీ మేరి కోరారు. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం సంస్థలు తమ అవసరాలకు తగిన నైపుణ్యాలు గల యువత దొరకటం లేదని వాపోతున్నట్లు, మిగిలిన 60 శాతం సంస్థలు కొత్త తరహా ఉద్యోగాలకు తగిన సన్నదత యువతలో కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ”మెకిన్సే” నివేదిక వెల్లడించిందని, 21వ శతాబ్ది అవసరాలకు కనుగుణంగా ఉపాధ్యాయుల పాత్రలు, బాధ్యతలు పరిణతి చెందాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్న వాస్తవాలని ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్న యువత కనుచూపుమేరలో కనిపించకపోవడమే సంక్షోభానికి కారణమని, ఉపాధికి నైపుణ్యాలకు మధ్య విస్తరిస్తున్న ఈ అగాధాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని ప్రిన్సిపల్ లిల్లీ మేరి అన్నారు. ఆచరణాత్మక విద్య నేటి ప్రాథమిక అవసరమని ఆమె తెలిపారు. విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించాల్సిన బాధ్యత గురువులపై ఉందని, కుర్చీలకు మాత్రమే పరిమితమై, పుస్తకాల్లోని విషయాలను బట్టి కొట్టించే పద్ధతులను టీచర్లు ఇక స్వస్తిపలకాలని, ఒకే సమస్యకు అనేక పరిష్కారాలు అన్వేషించగల సామర్థ్యం యువతకు అలవాడాలంటే విద్యార్థులలో విమర్శనాత్మక విశ్లేషణాత్మక దృక్పథం పెంపొందించాలని శ్రీమతి లిల్లీ మేరి అన్నారు. ఈ కార్యక్రమమునకు సహాయ ఆచార్యులు కమల, ఉమామహేశ్వరి, లెక్చరర్స్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.