చేతులు జోడించి మొక్కుతున్న తెలంగాణపై కేంద్రం పక్షపాతాన్ని మానుకొండి
- అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీకి చేతులు జోడించి చెబుతున్నానని కేసీఆర్ అన్నారు. తెలంగాణపై కేంద్రం పక్షపాతాన్ని మానుకోవాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు.రైతు వేదికలు దేశంలో ఎక్కడా లేవని, దమ్మున్న ప్రభుత్వం ఉంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి జలాలు వస్తున్నాయని, ఎండకాలంలో కూడా చెరువులు మత్తడి పారుతున్నాయని, కాలువల్లో నీళ్లు ఎలా పారుతున్నాయో… రేపు మా డబ్బాల్లో కూడా ఓట్లు పారుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో 361 బిలియన్ టన్నుల కోల్ నిల్వలున్నాయని, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఎందుకు దిగుమతి చేసుకోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. దమ్మున్న ప్రధాని ఉంటే కరెంట్ ఎందుకు రాదు? అని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరంతర విద్యుత్ ఇస్తున్నారా? అని కేసీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటూ ఎవరో ధర్నా చేశారని, గ్రిడ్ లోడ్ బ్యాలెన్స్ లేకుంటే కరెంట్ కట్ చేస్తారని, నిమిషం కూడా కరెంట్ పోదు.. పోనివ్వనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎంత ఖర్చు అయినా సరే కరెంట్ పోనివ్వనని, 16 వేల మెగావాట్ల లోడ్కు చేరినా కరెంట్ పోదని కేసీఆర్ స్పష్టం చేశారు.ఏటా 50 వేల టీఎంసీల నీరు వృధాగా పోతోందని మండిపడ్డారు. దేశంలో నీటి కోసం యుద్ధాలు ఎందుకు?, ఈ పరిస్థితులు పోవాలంటే రైతు రాజ్యం రావాలని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీతో కాలేదు కాబట్టే… బీఆర్ఎస్ పుట్టిందని, తమ నినాదం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలి?, కేంద్రం తీరుతో తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. వడ్లు కొనమంటే నూకలు తినమంటూ అహంకారంతో మాట్లాడారని, వడ్లు పండించడంలో పంజాబ్తో పోటీ పడుతున్నామని, త్వరలో తెలంగాణ మొదటి స్థానంలోకి వస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.బ్రిజేష్ ట్రైబ్యునల్ వేసి 20 ఏళ్లు దాటిందని, కేంద్రానికి నీళ్ల లెక్కలు తేల్చడం చేతకావడం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. 40 వేల టీఎంసీలు ఇస్తే దేశంలో నీటి యుద్ధాలే ఉండవని, దీనికి విశ్వగురువులే అవసరం లేదు.. దేశ గురువులుంటే చాలు అని, దేశానికి కొత్త ఇరిగేషన్ పాలసీ అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి ఎకరానికి.. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామని, రాబోయేది తమ ప్రభుత్వమే.. చెప్పింది చేసి చూపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.