మోడీ చేతుల మీదుగా అయోధ్య ప్రాణ ప్రతిష్ట

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆలయ తుది దశ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానుండగా.. వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్య రామమందిరంలో రాముడు కొలువుదీరనున్నాడు. దీనికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే తేదీని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి అతిథులను ఆహ్వానించే పనిలో ట్రస్ట్ సభ్యులు తలమునకలై ఉన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీలోని ఆయన నివాసంలోకి వెళ్లి.. రామాలయ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావాలని ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలుస్తోంది.2024 జనవరి 22 వ తేదీన అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆలయ ఆవరణలో ఉన్న రామ్‌ లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త ఆలయంలోని గర్భగుడిలోకి తీసుకువెళ్లనున్నారని సమాచారం. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొత్తం ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా చాలా మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆలయ ట్రస్ట్ రెండు రోజుల అనధికారిక సమావేశం నిర్వహించింది. ఇందులో రామ మందిరంలో రామ్ లల్లా ప్రతిష్టకు సంబంధించి ముఖ్యమైన విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు రామజన్మభూమి కాంప్లెక్స్‌ను కమిటీ సభ్యులు పరిశీలించారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం పండితుల నుంచి అభిప్రాయాలు కోరినట్లు తెలుస్తోంది. ఇక అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్యామశీల తయారు చేశారు.అయితే అయోధ్య రాముడి విగ్రహానికి సంబంధించిన తాత్కాలిక చిత్రాలను ఆలయ ట్రస్టు సభ్యులు గతంలో విడుదల చేశారు. ముఖం మీద మధురమైన చిరునవ్వుతో, చేతిలో విల్లుతో నిలబడి ఉన్న రూపంలో రాముడు ఉంటాడని తెలిపారు. కర్ణాటకలోని కర్కర్, హిగ్రీవన్‌కోట్ గ్రామాల నుంచి తీసుకొచ్చిన రాళ్లతో ఈ రాముడి విగ్రహాన్ని నిర్మిస్తామని గతంలోనే అధికారులు వెల్లడించారు.అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం కోసం మొత్తంగా 3 విగ్రహాలను తయారు చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 3 విగ్రహాలను వేర్వేరు శిల్పులు చెక్కుతున్నారని.. అందులో అత్యంత సుందరంగా ఉన్న దాన్ని ఎంపిక చేసి.. అయోధ్య రామ మందిరంలోని గర్భ గుడిలో ప్రతిష్ఠాపన చేస్తారని వెల్లడించారు. 51 అంగుళాల ఎత్తుతో బాలుడి రూపంలో రాముడి విగ్రహం ఉంటుందని తెలిపారు. ధనస్సు, విల్లు ధరించి.. కమలంపై కూర్చొని ఉంటాడని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.