బాలినేని నా మజాకా!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అధికారుల బదిలీల్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉంటుందనేందుకు ఒంగోలు డీఎస్పీ బదిలీ వ్యవహారం మచ్చుతునకగా మారింది. ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్థన్‌ బాధ్యతలు చేపట్టగా ఆ వెంటనే ఆయనను దర్శికి బదిలీ చేశారు. అక్కడ డీఎస్పీ నారాయణస్వామిరెడ్డిని ఒంగోలుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ససేమిరా అనటంతో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ ఉత్తర్వులు మార్చేశారు. వివిధ రకాల సమస్యలపై అలకబూని పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పదవికి బాలినేని రాజీనామా చేయటం, ఆపై సోమవారం (మే 1, 2023) సీఎం జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఒంగోలు డీఎస్పీపై బాలినేని సూచించిన వారికే అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. అయితే అనూహ్యంగా గురువారం రాత్రి అశోక్‌వర్థన్‌ ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కొద్దిసేపటికే జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అశోక్‌వర్థన్‌ బాధ్యతలు తీసుకున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించవద్దన్న సమాచారం పంపారు. అందిన సమాచారం మేరకు.. అప్పటికే డీజీపీ బాలినేనితో మాట్లాడినట్లు తెలిసింది.డీఎస్పీ విషయంలో తాను వెనక్కు తగ్గనని, తాను తాజాగా సూచించిన దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డిని ఒంగోలుకు మార్చి మీరు కావాలంటే అశోక్‌వర్థన్‌ను దర్శికి వేసుకుంటే అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఉన్నతాధికారుల నుంచి నూతన బదిలీ ఉత్తర్వులు వస్తాయని వేచి ఉండాలని మౌఖిక ఆదేశాలు జిల్లా పోలీసు అధికారులకు అందాయి. దీంతో ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్థన్‌ బాధ్యతలు తీసుకున్న విషయాన్ని ప్రకటించకుండా ఆపేశారు. మరోవైపు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే ఒంగోలు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు నారాయణస్వామిరెడ్డి ఆగమేఘాలపై సిద్ధమవటం విశేషం. అయితే విజిలెన్స్‌ నుంచి అశోక్‌వర్థన్‌ రిలీవ్‌ అయి మూడురోజులు పూర్తయినందున నిబంధనల మేరకే బాధ్యతలు తీసుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా కీలకమైన డీఎస్పీ స్థాయి అధికారి బదిలీ ఉత్తర్వులు ఆగమేఘాలపై మారటంతో పవర్‌ దెబ్బ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.