తీవ్ర భావోద్వేగానికి లోనై కంట తడిపెట్టిన బాలినేని..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో సంచలనాలకు కేరాఫ్‌గా తయారయ్యారు. ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా బాలినేని.. బాలినేని అనే వస్తోంది. తనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యత తగ్గించారని.. అది కూడా వైసీపీ నేతలు ఈ పనిచేస్తున్నారని తీవ్ర అసంతృప్తితో అధిష్టానం తనకిచ్చిన రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం పెను సంచలనమే అయ్యింది. ఆ తర్వాత బాలినేని ఫోన్‌కాల్‌కు, నియోజకవర్గంలో కూడా అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లోనే వారం రోజులపాటు ఉండిపోయారు. పార్టీ ముఖ్యనేతలతో జగన్ మాట్లాడించినా వర్కవుట్ అవ్వకపోవడంతో ఇక డైరెక్టుగా సీఎం రంగంలోకి దిగి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు రప్పించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని ఇద్దర్నీ కూర్చోబెట్టి 45 నిమిషాలకు పైగా బుజ్జగించినా ఫలితం లేకపోయింది. ఆఖరికి తీవ్ర అసంతృప్తితోనే సమావేశం నుంచి బయటికొచ్చారు. అక్కడ్నుంచి నేరుగా మీడియా కంట పడకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. భాగ్యనగరం నుంచి ఒంగోలుకు వెళ్లిన బాలినేని అనూహ్యంగా మరో బాంబ్ పేల్చారు. ఈసారి బాలినేని చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.ఈ సందర్బంగా బాలినేని మాట్లాడుతూ ‘ నాకు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. 1999 లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2009లో వైఎస్సార్ మంత్రి పదవి ఇచ్చారు. వైఎస్సార్ మరణం నా రాజకీయ జీవితంలో తీరని లోటు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో మంత్రి పదవి తీస్తామని చెప్పినా లెక్క చెయ్యలేదు. జగన్ వెంటే నేను నడిచాను. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కీలక నేతగా పని చేశాను. ఈ మధ్య చెన్నై హవాలా , భూ కబ్జాలు, సినీమాలో పెట్టుబడులు అని నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ కోసం ఎంతో శ్రమించా.. ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ నాపై నిందలు, ఆరోపణలను భరించలేకపోతున్నా’ అని బాలినేని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గోనె ప్రకాశ్‌కు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది?. గోనెతో కావాలనే కొందరు మాట్లాడిస్తున్నట్లు ఉంది. వైవీ సుబ్బారెడ్డి, అతని భార్యను పొగిడిన గోనె.. జగన్, భారతిని విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి’ అని బాలినేని చెప్పుకొచ్చారు.

ఇంతకీ గోనె ఏమన్నారు..?

వాస్తవానికి గత కొన్నిరోజులు బాలినేని పార్టీ మారుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు మీడియా ముందుకొచ్చి బాలినేని గురించి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. బాలినేనికి వందల కోట్లు ఎలా వచ్చాయి..? విదేశాల్లో గ్యాంబ్లింగ్‌లు ఆడిన చరిత్ర బాలినేనిదని గోనే చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ గ్యాంబ్లింగ్ కోసం స్పెషల్ ఫ్లైట్లలో కూడా వెళ్లారని ఆయన విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి దయవల్లే బాలినేని ఎమ్మెల్యే అయ్యారని.. అలాంటి వైవీని ఆడిపోసుకోవద్దని సూచించారు. అంతటితో ఆగని గోనె.. బాలినేని టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోందని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. గోనె చేసిన ఈ వ్యాఖ్యలకు బాలినేని పై విధంగా స్పందించారు.

సొంత పార్టీ నేతలపై బాలినేని తీవ్ర అసంతృప్తి..

గోనె గురించి మాట్లాడిన తర్వాత సొంత పార్టీ నేతలపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వైసీపీ కోసం ఎంత శ్రమించానో, ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నేను పార్టీ మారుతానని మా నేతలే ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలకు న్యాయం చేయలేనప్పుడు పదవులు ఎందుకు..?. రీజనల్ కోఆర్డినేటర్ పదవి చెయ్యలేనని సీఎం జగన్‌కి నేనే చెప్పా. నాపై ఎమ్మెల్యేలతో సీఎంకు ఫిర్యాదు చేయిస్తున్నారు. నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా వైసీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటా. కార్యకర్తలకి న్యాయం చేస్తుంటే నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసే వాళ్ళు ఒక్క ఆరోపణ అయినా రుజువు చేయాలి. నేను టికెట్‌ ఇప్పించిన వాళ్లే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు’ అని జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో పాటు పరోక్షంగా పార్టీ పెద్దలపై కూడా బాలినేని విమర్శలు గుప్పించారు. మొత్తానికి చూస్తే.. బాలినేని ఎపిసోడ్‌ రోజురోజుకూ పెరుగుతోందే తప్ప ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ఇప్పటికే వైసీపీలో ఈయన కామెంట్స్ హాట్ టాపిక్ అవ్వగా తాజాగా చేసిన కామెంట్స్‌కు ఏ పరిణామాలకు దారితీస్తాయో తెలియని పరిస్థితి. ఈ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి, గోనె ప్రకాష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.