భారత్‌ జోడో యాత్ర@ 100 రోజులు..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/జైపూర్: జైపుర్‌: కన్యాకుమారి నుంచి కశ్మీర్‌వరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోన్న ఈ యాత్ర శుక్రవారానికి 100 రోజులు పూర్తి చేసుకోనుంది. గడిచిన మూడు నెలలకుపైగా ఈ యాత్రను కొనసాగిస్తోన్న పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. అన్ని వర్గాల వారిని పలుకరిస్తూ, సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులో సెప్టెంబర్‌ 7న మొదలైన భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో కొనసాగింది. తమిళనాడుతో సహా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పూర్తికాగా ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. డిసెంబర్‌ 24న దేశ రాజధాని దిల్లీలోకి ప్రవేశించనుంది. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చివరకు జమ్మూ, కశ్మీర్‌లో ముగుస్తుంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర లక్ష్యం మొత్తం 3500కి.మీ కాగా.. అందులో ఇప్పటికే 2800కి.మీలు పూర్తి చేసుకుంది.

భాజపా విమర్శలు.. రాహుల్‌కి సవాళ్లు..
భాజపా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడమే తన ప్రయత్నమని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చెబుతుండగా.. భాజపా మాత్రం కాంగ్రెస్‌ నేతపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. పాదయాత్ర ప్రారంభంలో రాహుల్‌ ధరించిన టీ-షర్టు అత్యంత ఖరీదైందంటూ (రూ.41వేలు) విమర్శించింది. అనంతరం ఇరాక్‌ నియంత సద్దాం హుస్సేన్‌ మాదిరిగా రాహుల్‌ గాంధీ కనిపిస్తున్నారంటూ భాజపా నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శించారు. మరోవైపు ఈ యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోన్న సమయంలో మిత్ర పక్షాలైన శివసేన, కాంగ్రెస్‌ల మధ్య ‘సావర్కర్‌(VD Savarkar)’ విషయంలో వివాదం చెలరేగింది. దీంతో పాటు మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర జరుగుతోన్న వేళ.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇవన్నీ సద్దుమణిగినప్పటికీ.. రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను రాహుల్‌ గాంధీ ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రముఖులు తోడు..
సుదీర్ఘ పాదయాత్ర చేస్తోన్న రాహుల్‌ గాంధీకి పార్టీ కార్యకర్తలు, సామాన్య పౌరులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటివరకు పూజా భట్‌, రియా సేన్‌, స్వరభాస్కర్‌, రష్మీ దేశాయ్‌ వంటి బాలీవుడ్‌ నటులు యాత్రలో పాల్గొని ఆయనకు మద్దతు పలకగా.. మాజీ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఎల్‌ రాందాస్‌, శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘరాం రాజన్‌ వంటి ప్రముఖులు ఈ యాత్రలో రాహుల్‌తో అడుగేసి మద్దతును తెలియజేశారు.

ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా..?
భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు పౌరుల నుంచి స్పందన వస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో అది ఏ మేరకు ఫలితాలు ఇస్తుందనే వాదన నెలకొంది. ఇదే సమయంలో ఇటీవల జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) మాత్రం మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అవసరమైన మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేయలేదనే వాదన వినపడింది. అయినప్పటికీ.. హిమాచల్‌లో స్పష్టమైన మెజారిటీతో పార్టీ విజయం సాధించగా.. గుజరాత్‌లో మాత్రం ఘోర పరాజయం పాలయ్యింది. వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌లలోనూ ఇటువంటి ఫలితాలే పునరావృతమయ్యే అవకాశం ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాహుల్‌ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర(Rahul Padayatra).. కాంగ్రెస్‌ పార్టీకి దీర్ఘ కాలంలో ‘గేమ్‌ ఛేంజర్‌’గా మారనుందని పార్టీ నేత సంజయ్‌ ఝా పేర్కొన్నారు. భాజపా పాలిత రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ విజయం సాధించే సత్తా ఉందనడానికి ఇటీవల (హిమాచల్‌ ప్రదేశ్‌లో) ఫలితమే నిదర్శనమన్నారు. రాహుల్‌ యాత్ర పార్టీ శ్రేణులకు కొత్త ఆశలు కలిగిస్తున్నప్పటికీ అవి ఓట్లుగా ఏ మేరకు మారుతాయో చూడాలని రాజకీయ విశ్లేషకుడు, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ సంజయ్‌ పాండే అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.