సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ భయపడుతోంది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ భయపడుతోందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ అన్నారు. అదే సమయంలో హిందుస్థాన్ అవామ్ మోర్చా-సెక్యులర్ వ్యవస్థాపకుడు జీతన్ రామ్ మాంఝీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ అధికార కూటమి మహాకూటమి పార్టీలపై ఆయన బీజేపీ తరపున గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించారు. హెచ్ఏఎంఎస్ను జేడీయూలో విలీనం చేయడానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఆ పార్టీ ఇకపై మహాకూటమిలో భాగంగా ఉండబోదని చెప్పారు.నితీశ్ కుమార్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 23న ప్రతిపక్షాల సమావేశం జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెరుగుతుండటంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగితే తనకు నష్టం జరగవచ్చునని బీజేపీ భయపడుతోందన్నారు. అందుకే ముందస్తు ఎన్నికలు రావచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహాకూటమి పార్టీలపై మాజీ ముఖ్యమంత్రి మాంఝీ బీజేపీ తరపున గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించారు. హెచ్ఏఎంఎస్ను జేడీయూలో విలీనం చేయడానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఆ పార్టీ ఇకపై మహాకూటమిలో భాగంగా ఉండబోదని చెప్పారు. ఈ నెల 23న జరిగే ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనాలని మాంఝీ కోరుకున్నారని, అయితే ఆయన ఈ సమావేశం వివరాలను బీజేపీకి చెప్పేస్తారనే భయం వల్ల ఆయనను ఆహ్వానించలేదన్నారు.మాంఝీ స్పందిస్తూ, మహా కూటమి నుంచి బయటపడటం వల్ల తమకు గొప్ప విముక్తి లభించినట్లయిందన్నారు. తమ పార్టీ త్వరలోనే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందన్నారు. మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ ఇటీవలే నితీశ్ మంత్రివర్గం నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. జేడీయూలో హెచ్ఏఎంఎస్ విలీనమవాలనే ప్రతిపాదన రావడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.