తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లోకంలో జనాలకు చాలా సమస్యలున్నాయి. కొందరికి ఉండేందుకు ఇళ్లు లేకపోవటం సమస్య అయితే.. మరికొందరికి తినడానికి తిండి దొరకపోవటం సమస్య. ఇవన్నీ దేశంలో కాదు.. ప్రపంచంలో చాలా మంది ఎదుర్కునే ప్రాబ్లమ్స్. కానీ.. కొందరికి మాత్రం విచిత్రమైన సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ఒకటే ఈ యువకుడికి వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో ఓ యువకుడు.. బిర్యానీలో వచ్చిన బొక్కలు కొరికితే విరగటం లేదంటూ.. ఏకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఇదేంటీ బొక్కలు కొరుకుడేందీ.. అవి విరగటమేందీ.. అని ముక్కిరవకండి.. మీరు చదివింది నిజమే. ఓ యువకుడికి బిర్యానీ తినాలనిపించి.. పట్టణంలోని రెడ్ బకెట్ ప్రాంచైజీ దుకాణానికి వచ్చి ఓ బకెట్ బిర్యానీ కొనుగోలు చేశాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఎంతో ఆబగా తింటున్నాడు. ఈ క్రమంలోనే తనకెంతో ఇష్టమైన లెగ్ పీస్ తీసుకుని కొరుక్కుని తింటుండగా.. బొక్క మాత్రం ఎంత కొరికినా విరగలేదు. దీంతో.. ఇది అసలు చికెనేనా అని ఆ యువకుడికి అనుమానం వచ్చింది.
అనుమానం వచ్చిన వెంటనే.. రెడ్ బకెట్ దుకాణానికి వెళ్లి.. నిలదీశాడు. ఎంత కొరికినా బొక్కలు విరగటం లేదని.. ఇది అసలు చికెనే కాదని దుకాణాదారునికి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తటంతో.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. ఆ యువకుడు పోలీసులకు విషయాన్ని వివరించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి వాదనలు విన్న పోలీసులు.. ఆ బిర్యానితో పాటు, బొక్కలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు.. దుకాణాదారునితో పాటు యువకున్ని కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పంచాయితీ తమతో తేలేది కాదని తేలిసి.. ఫుడ్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించారు.