కాటు వేసే కాలం..జాగ్రత్తలు అవసరం
- ఏటా దేశంలో పాము కాటుకు గురవుతున్న 12.5 లక్షల మంది - ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాము కాటు మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పాముకాటు మరణాలలో భారతదేశం లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పాము కాటుకు గురవుతుంటే మనదేశంలో 12.5 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. వారిలో 60 వేల మంది మృత్యువాత పడుతున్నారని జాతీయ మరణాల సర్వే చెప్తుంది. ఇదే విషయాన్ని హైదరాబాదులోని ” సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ” నిరుడు నివేదించింది. ఇండియాలో ప్రధానంగా 60 రకాల విష సర్పాలు మనుగడ సాగిస్తున్నాయి అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.
సర్పాలు, విషపురుగులతో జాగ్రత్త, పొలాల్లో పొంచి ఉన్న ప్రమాదం , వర్షాకాలంలో విష సర్పాలు, పురుగులు సంచారం అధికంగా ఉంటుంది. అవి పెట్రోలు, కిరోసిన్, వెల్లుల్లి, ఇంగువ వాసనను భరించలేవు. వీటిని అoదు బాటలో ఉంచుకుని సమయానుకూలంగా వినియోగించుకోవాలి. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే రబ్బరు బూట్లు, చేతి తొడుగులు ధరించాలని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు. పొలం గట్లు, కాలువగట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చి మొక్కలతో నిండిన పొదులు, గడ్డివాములు , పాడుబడ్డ ఇల్లు, గృహాలు ఎదుటి పేర్చిన కట్టెలు, పెంటకుప్పల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం బయటకు వచ్చి ఎలుకలు, బల్లులు, తొండలు, పక్షులను తింటాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో పాములు అక్కడే తిష్ట వేస్తాయి. పాములకు శరీరం కింద భాగంలో ఉండే ప్రత్యేక పోలుసుల ద్వారా శబ్దం గ్రహిస్తాయి. వేడి రక్తం ప్రసవించే జంతువులు, మనుషులు సమీపిస్తే వెంటనే గుర్తిస్తాయి. కదులుతున్న ప్రాణులను గుర్తించి కాటేస్తాయి. నాగుపాము, కట్లపాము, రక్తపింజర తదితర పాములు విషపూరితమైనవి. వీటి కాటు గురైన బాధితులకు వెంటనే వైద్యమందక ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా పంట పొలాలు, కాలువల్లో తిరిగే పాములు చాలా వరకు విషపూరితమైనవి కావు. సర్పాలకు ప్రాణభయం ఉన్నప్పుడు, ఏకాంతానికి భంగం వాటిలినప్పుడు, ఎవరైనా తొక్కినప్పుడు, వేటాడేటప్పుడు కాటేస్తాయి.
అన్ని ప్రమాదం కావు …
పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. కట్లపాము వంటి 15% ప్రమాదకరమైన సర్పజాతుల్లోనే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా 60% పాము కాట్లు విషము. ప్రమాదం లేని పాములు గాయాలే . చికిత్స తీసుకుంటే నయమవుతాయి. పాములు కన్నా చాలా మంది షాక్ తో ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. ఇంట్లో వారు, ఇరుగుపొరుగువారు ధైర్యం చెప్పడానికి బదులుగా ఏడుపులు ప్రారంభిస్తే బాధితులు భయాందోళనకు గురైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
రాత్రి వేళల్లో తిరిగేవాళ్లు, అక్కడే నిద్రించేవాళ్లు, టార్చ్ లైట్ను వెంట తీసుకుపోవాలి. పాములు చేరడానికి అవకాశం లేకుండా పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పెట్రోలు, కిరోసిన్, వెల్లుల్లి, ఇంగువ వాసనలను భరించలేవు. పాములు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే సమయాన్నికూలంగా వీటిని ఉపయోగించుకోవాలి. రాత్రివేళలో పొలాల గట్లపై, గడ్డివాముల్లో తిరిగే రైతులు, కూలీలు మోకాళ్ళ వరకు రబ్బరు బూట్లు, చేతులకు రబ్బరు తొడుగులు ధరించాలి. ఇల్లు, కార్యాలయాలు, పాఠశాలలు పరిసరాలలో పిచ్చి మొక్కలు, పొదలు ఉండకుండా చూసుకోవాలి.
సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలి
పాము కాటు గురైన వ్యక్తి ఆందోళన చెందొద్దు, బాధితుడికి ధైర్యం చెబుతుండాలి. పాము కాటేసిన పై భాగంలో వెంటనే తాడు, గుడ్డతో బిగుతుగా కట్టాలి. కాటేసిన చోట బ్లేడుతొ గాయం చేసి రక్తం కారనివ్వాలి . నోటిలో పుండ్లు, గాట్లు లేకుంటే రక్తం పీల్చి ఉమ్మి వేయాలి. పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించడం, పరిగెత్తించడం చేయొద్దు. పాము విషానికి విరుగుడుగా “పాలివేలెంట్ స్నేక్ యాంటీ వీనం” మందు ప్రతి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంటుందని, పాము కాటుకు గురైన బాధితులకు మొదటి మూడు గంటల లోపు’ స్నేక్ యాంటీ వీనం’ అందించగలిగితే ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్ లిల్లీ మేరీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి పైగా తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు. నాటువైద్యం పేరిట పసర్లు, వేర్లు, మంత్రాలు అంటూ కాలయాపన చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.