టిఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం మున్సిపాలిటీ కి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో టీఆరెఎస్ లో చేరారు. వాళ్లకు గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలోనే టిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు. ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కెసిఆర్ అనుభవంతో కూడిన దిశా నిర్దేశం, యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ లీడర్షిప్ ఉన్న పార్టీ అని చెప్పారు. భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమి లేదన్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. టిఆర్ఎస్ లో చేరిన వారిలో చండూరు కు చెందిన రామస్వామి వెంకటేశ్వర్లు, బొమ్మకంటి ఆంజనేయులు, బిలాల్, జాకీర్, నదీం తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.