సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా, కాంగ్రెస్ పార్టీలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుండగా, రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం. విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. విపక్ష భేటీలో కూటమికి కొత్త పేరు, సమన్వయకర్తల నియామకం, సీట్ల సర్దుబాటు కోసం కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది.ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ, ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానం, నిరుద్యోగం తదితర అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టే వ్యూహంపైనా విపక్ష నేతలు చర్చించనున్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్దతిచ్చిన నేపథ్యంలో విపక్ష భేటీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరవుతుండటం విశేషం. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్లో కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ వైఖరి అంతుచిక్కడం లేదు. బీజేపీతో జేడీఎస్ మైత్రి ఏర్పాటు చేసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఢిల్లీ వెళుతున్నాతారనే చర్చ జోరందుకుంది. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత జేడీఎస్తో కలసి వెళ్లాలనే ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే