తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ఆ మేరకు సంకేతాలు ఇచ్చారు. కొంత మంది పార్టీ నేతలతో ఆయన సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో కలిసి వెళ్లొద్దని పార్టీ సుప్రీం దేవెగౌడను కోరారు. సెక్యులర్గా ఉన్న తన వర్గమే అసలైన జేడీఎస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. తనకే అధికారం ఉంటుందని అన్నారు. ‘వారు(దేవెగౌడ, కుమారస్వామి) బీజేపీతో వెళ్లాలనుకొంటే వెళ్లొచ్చు. తాము మాత్రం ఆ పని చేయలేం’ అని వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. బీజేపీతో వెళ్లకూడదని తాము ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నామన్నారు. తనతో చాలా మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పేర్కొన్న ఇబ్రహీం.. వారి పేర్లు చెప్పేందుకు మాత్రం తిరస్కరించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో సమావేశం అవుతానని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని చెప్పారు.
పార్టీని వీడుతున్న నేతలు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో కలిసి వెళ్లకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామని, అదేవిధంగా కూటమిని ఆమోదించవద్దని దేవెగౌడను కోరుతామని ఇబ్రహీం పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ప్రకటన వల్ల కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో నేతలు పార్టీని వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఆ కమిటీ దేవెగౌడకు వివరిస్తుందని తెలిపారు.