బీహార్లోని మొత్తం 40 స్థానాల్లోనూ బీజేపీ గెలవబోతోంది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని మొత్తం 40 స్థానాల్లోనూ బీజేపీ గెలవబోతోందని, 2025లో బీహార్లో అధికారంలోకి వస్తామని షా జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే సాసారామ్, బీహార్ షరీఫ్ తదితర ప్రాంతాల్లో హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీహార్లో ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని షా చెప్పారు. ఎన్నికల తర్వాత జేడియూ తిరిగి ఎన్డీయే గూటికి వస్తుందేమో అనే సందేహం అక్కర్లేదని, జేడియూకు శాశ్వతంగా ద్వారాలు మూసేశామన్నారు. నితీశ్ కుమార్ ప్రధాని కావాలని, తేజస్వీసీఎం కావాలని అనుకుంటున్నారని, అయితే రెండూ అసాధ్యమని షా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారని షా చెప్పారు. బీహార్లోపర్యటించిన కేంద్ర హోమంత్రి అమిత్ షాతన వ్యాఖ్యలతో కలకలం రేపారు. నవాడాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా బీహార్లోని సాసారామ్, బీహార్ షరీఫ్ తదితర ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. సాసారామ్లోఅమాయకులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారని, ఉద్రిక్తతల కారణంగా తాను అక్కడకు వెళ్లలేకపోతున్నానని చెప్పారు. త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ప్రార్ధిస్తానన్నారు. బీహార్లో శాంతి భద్రతల పరిస్థితులపై తాను గవర్నర్తో మాట్లాడితే జేడియూ, ఆర్జేడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని షా విమర్శించారు. ఆర్జేడీ భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వంతో శాంతి భద్రతలు ఆశించలేమని చెప్పారు. లాలూ జంగిల్ రాజ్ తిరిగివచ్చిందని షా విమర్శలు చేశారు. అధికార దాహంతో నితీశ్ లాలూఒడిలో కూర్చున్నారని షా ఎద్దేవా చేశారు.రామమందిరానికి వ్యతిరేకంగా కాంగ్రెస్,జేడియూ,ఆర్జేడీ,మమత,డీఎంకే,ఆందోళనలు చేశాయని అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకు స్థాపన చేశారని షా గుర్తు చేశారు.గతంలో జేడియూ-బీజేపీ చాలాకాలం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నాయి. కొంత కాలం క్రితం వరకూ జేడియూ-బీజేపీ సంకీర్ణ సర్కారు కొనసాగాక నితీశ్ బయటకు వెళ్లిపోయి ఆర్జేడీతో చేతులు కలిపి కాంగ్రెస్తో కూడా కలిసి బీహార్లో సంకీర్ణ సర్కారు మహాఘఠ్బంధన్ ఏర్పాటు చేశారు. నితీశ్ బయటకు వెళ్లిపోవడానికి ప్రధాన కారణం తన పార్టీ బలహీనపడి బీజేపీ బలపడుతుండటమే కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.