అనాగరికం వైపు వెళ్తున్న బీజేపీ నాయకులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ప్రధాని మోదీ కార్పొరేట్లకు రూ. 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాడు. నేను చెప్పింది అబద్ధమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక వేళ వాస్తవమైతే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.అభివృద్ధి పనులతో మనం నాగరికం వైపు పోతుంటే.. బీజేపీ నాయకులు మాత్రం అనాగరికం వైపు వెళ్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ, దగ్బులాజీ డైలాగులు కొడుతూ విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని నిప్పులు చెరిగారు. దయచేసి ఆలోచించండి. ఆగం కాకండి. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అని ఒకడు అంటుండు. నేను చెప్పెది తప్పు అయితే వాళ్లు వేసే ఏ శిక్షకైనా సిద్ధం. బడ్జెట్లో కేంద్రం చెప్పిందే నేను చెప్తున్నాను. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ దేశానికి ఇప్పటి వరకు 14 మంది ప్రధానులు పని చేశారు. వారు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లు. మోదీ ప్రధాని అయ్యాక చేసిన అప్పు.. రూ. 100 లక్షల కోట్లు. దేశంలో పుట్టే ప్రతి బిడ్డ మీద రూ. లక్షా 25 వేల అప్పు మోపుతున్నది మోదీ కాదా? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ మీద అదనంగా సెస్సులు వేసి రూ. 30 లక్షల కోట్లను మోదీ వసూలు చేసిండు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.