ఇండియన్ రేసింగ్ లీగ్తో రోడ్లు బ్లాక్ .. రద్దీ ప్రాంతంలో రేసింగ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
ఇండియన్ రేసింగ్ లీగ్ నేపథ్యంలో పోలీసులు ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఖైరతాబాద్ నుంచి వచ్చే వాహనాలు ట్యాంక్బండ్ ఎక్కకుండా, ఐమాక్స్, రోటరీ వైపు వెళ్లకుండా క్లోజ్ చేశారు. దానికి కనెక్టివిటీగా ఉన్న మింట్ కాంపౌండ్ రోడ్డును కూడా మూసి వేశారు. షాదన్ నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్పైకి మళ్లించారు. హిమాయత్నగర్ లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా అసెంబ్లీ చౌరస్తా వైపు మళ్లించారు. సికింద్రాబాద్ వైపు నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను లోయర్ ట్యాంక్బండ్ మీదుగా ఇందిరాపార్కు వద్ద యూ టర్న్ పెట్టి మళ్లించారు. ఇలా ట్రాఫిక్ మళ్లింపులతో శనివారం సాగర తీరం చుట్టు పక్కల రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, రవీంద్ర భారతి, లిబర్టీ, లక్డీకాపూల్, ముషీరాబాద్, హిమాయత్నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కాగా
ఈ కార్ రేసింగ్ వంటి పెద్ద ఈవెంట్ను నగరం నడిబొడ్డున నిర్వహించడం ట్రాఫిక్పై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోందని వాహనదారులు వాపోతున్నారు. చుట్టుపక్కల రోడ్లన్నీ రోజంతా మూసివేయడంతో శనివారం విపరీతమైన ట్రాఫిక్లో చిక్కుకుని నరకం చూశామన్నారు. రూ. కోట్లు ఖర్చుచేసి రేసింగ్ ట్రాక్ నిర్మించిన అధికారులు ట్రాఫిక్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించకపోవడం ట్రాఫిక్ పోలీసుల వైఫల్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.