బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి (Begumpet Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆగంతకుల మెయిల్తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఆకతాయిలు పనిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెయిల్ ఐడీ ఆధారంగా ఆగంతకులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పలు పాఠశాలలు, విమానాలు, కార్యాలయాలు, రాజకీయ నాయకులకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశంలోని సుమారు 41 విమానాశ్రయాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే, బెదిరింపుల నేపథ్యంలో చేపట్టిన తనఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు.