బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. పార్టీ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అధికార బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి మాజీ ఎంపీ, మాజీ మంత్రిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు, ఉమ్మడి మహబుబూనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ వీరుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నియోజవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. తన తరపున అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఉండగా.. పలు మార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. గత ముడేళ్లుగా బీఆర్ఎస్ అధినాయకత్వం తనను పట్టించుకోవటం లేదని.., పార్టీలో తన సభ్యత్వాన్ని కూడా రెన్యూవల్ చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నిన్న (ఆదివారం) నిర్వహించిన పొంగులేటి ఆత్మీయ సమావేశానికి జూపల్లి తన అనుచరులతో కలిసి హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రభుత్వంపై ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. సింగరేణి కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన కూతురిని కాపాడుకునేందుకు రూ.కోట్లు వెదజల్లుతున్న సీఎంకు.. రిజర్వేషన్లపై పోరాడలేరా ? అని ప్రశ్నించారు. కేటీపీఎస్‌ ఉద్యోగులకు నాలుగేళ్లుగా పీఆర్‌సీ వర్తింపచేయడం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ప్రరవర్తన మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఇక మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అసంపూర్తి పథకాలు, నెరవేరని హామీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. తిండి లేకపోయినా ఫర్వాలేదని.. కానీ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోందన్న జూపల్లి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. దీంతో పొంగులేటి, జూపల్లి రాజకీయంగా ఏ స్టెప్ తీసుకోబోతున్నారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇద్దరు నేతలు బీఆర్ఎస్ అసంతృప్త నేతలను ఏకం చేసి కొత్త పార్టీ పెడతారా ? లేక ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరతారా ? అనేది వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.