మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్ఎస్ 10 కోట్ల ప్రచార వ్యయం!
- హాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు-నగదు పంపకం - మరఠ్వాడాలో హాట్టాపిక్గా గులాబీసభలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ పార్టీగా తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నాల్లో ఉన్న బీఆర్ఎస్.. మహారాష్ట్రలో మీడియాపై వరాల జల్లు కురిపిస్తోంది! అక్కడి ప్రముఖ పత్రికల్లో కవరేజీ కోసం పాత్రికేయులకు రాచమర్యాదలు చేస్తూ.. పత్రికలకు వాణిజ్య ప్రకటనలు గుప్పిస్తూ.. ఫస్టు పేజీలో, పతాకశీర్షికల్లో వార్తల కోసం పరితపిస్తోంది!! టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎ్సగా మారినప్పటి నుండి ఆ పార్టీ మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అక్కడ తమకు ఎలాంటి పట్టూ లేకపోవడంతో.. ప్రజల్లోకి బలంగా తన వాణి వెళ్లేందుకు మీడియాపై ఆధారపడుతోంది. ఈ క్రమంలో అక్కడ ఇప్పటివరకూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు మీడియా ప్రచారం కోసమే బీఆర్ఎస్ పార్టీ సుమారు రూ.10 కోట్ల దాకా ఖర్చు చేయగా.. వాటిలో ప్రధాన పత్రికలకే రూ.5 కోట్ల దాకా వాణిజ్య ప్రకటనలు, ఇతర ఖర్చుల రూపంలో ఇచ్చినట్లు సమాచారం.
ప్రధాన పత్రికల్లో యాడ్స్ ఎడాపెడా ఇస్తుండడంతో.. బీఆర్ఎస్ బహిరంగ సభల వార్తలు బ్యానర్గా వస్తున్నాయి. సభకు ముందు నేతలు నిర్వహించే ప్రెస్మీట్లను కూడా మొదటి పేజీలో ప్రధానంగా ప్రచురిస్తున్నారు. సాధారణంగా మన దగ్గర మొదటి పేజీలో శీర్షికలు, వార్తలో ప్రధానాంశాలు, కొంతమేరకు వార్త ఉంటాయి. కానీ మహారాష్ట్రలో మొదటి పేజీలో పెట్టే ఏ వార్తాకథనమైనా పూర్తిగా వస్తుంది. దీంతో జనం దాన్ని పూర్తిస్థాయిలో చదువుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా బ్యానర్ వార్తగా వేయించుకోగలిగితే.. కేసీఆర్ ప్రసంగం పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్తుందని బీఆర్ఎస్ నేతలు భావించడమే అక్కడి మీడియాపై ఈ ప్రేమకు కారణం. భారీ సర్క్యులేషన్ ఉన్నవి.. మధ్యస్థ, చిన్న పతిక్రలకు వాటి స్థాయిని బట్టి అడ్వర్టైజ్మెంట్లలో ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే.. ప్రెస్మీట్లకు, సభలకుహాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు చేస్తున్నట్లు.. పత్రికల యాజమాన్యాలతోనూ తరచూ సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేక ప్రతినిధులను కూడా నియమించినట్లు తెలుస్తోంది.
ప్రధాన పత్రికల జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.25 వేలు
ఈ సభలకు జనం తరలింపునకు మండలాల వారీగా నేతలకు డబ్బు ముట్టజెప్పడంతో పాటు బహిరంగ సభ కవరేజికి వచ్చే ప్రధాన పత్రికల జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.25 వేలు, అలాగే చిన్న పత్రికల జర్నలిస్టులకు రూ.10వేల చొప్పున ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే.. మండల స్థాయి జర్నలిస్టుల రాచమర్యాదల కోసం రూ.5 లక్షలను కేటాయిస్తూ జోరుగా ప్రచారానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. కారణమేదైనా బీఆర్ఎస్ ఇస్తున్న ఆఫర్లు చూసి మహారాష్ట్ర జర్నలిస్టులు ఆశ్చర్యపోతున్నట్లు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ..
మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలపైనా బీఆర్ఎస్ దృష్టి సారించింది. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లోనూ జోరుగా ప్రచారం చేస్తోంది. అక్కడి ప్రధాన పత్రికలకు లక్షల్లో యాడ్స్ ఇస్తూ ప్రచారం చేసుకుంటోంది. ఎక్కువ ధరైనా సరే.. ఫ్రంట్ పేజీలో, కలర్లోనే వాణిజ్యప్రకటనలు వేయిస్తోంది. మహారాష్ట్రలో బహిరంగ సభలు నిర్వహించే రోజుల్లో.. ఢిల్లీ, పంజాబ్ పత్రికల్లోనూ బీఆర్ఎస్ వాణిజ్య ప్రకటనలు ఇస్తోంది. కేవలం మీడియాతో సంప్రదింపులు జరిపేందుకే ప్రత్యేకంగా కొంత మంది ప్రజా ప్రతినిధులను నియమించుకుని బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.