జూలై రెండున తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జులై 2న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందని అన్నారు. ఆ రోజు మక్తల్ శాసనసభ సభ్యుడు వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారని కూడా చెప్పారు. ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి కవ్వంపల్లి శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతు రుణమాఫీ మీద అనవసర రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు రాజీనామా పత్రంతో రెడీగా ఉండాలని సూచించారు. మరోవైపు, రుణమాఫీ ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని శ్రీహరి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.