డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయండి

.. జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించిన విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎల్ కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని బీఎస్డి డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా డీఈవోదేనని స్పష్టం చేశారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో పాఠశాల విద్యా శాఖ సంచాలకులుస్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శిపోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని వెల్లడించారు.ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.