అత్యాచారాలకు నిరసనగా నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ

- బషీర్ బాగ్ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ - నిందితులను హీరోలుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోంది - కేసీఆర్ బిడ్డకో న్యాయం? ఇతరులకో న్యాయమా? - ర్యాలీలను విజయవంతం చేయండి - బీజేపీ నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మెడికల్ విద్యార్థి ప్రీతి నాయక్ హత్యసహా రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బషీర్ బాగ్ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యాచారాలకు నిరసనగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

• టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థినులపై, మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం అండతో అత్యాచారాలు, హత్యలు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. అత్యాచారాలు, హత్యలను సైతం చిన్న నేరాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

• మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగినప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. కనీసం అధికారులతో సమీక్ష కూడా చేయకపోవడం చూస్తుంటే మహిళల రక్షణపట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతోందన్నారు.

• దొంగ సారా దందాలో అడ్డంగా బుక్కైన తన బిడ్డను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న కేసీఆర్… రాష్ట్రంలోని అమాయక విద్యార్థినులు, మహిళలపై అన్యాయంగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డకో న్యాయం? ఇతరులకో న్యాయమా? అని ప్రశ్నించారు.

• టెలికాన్ఫరెన్స్ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ చేపడుతున్న కొవ్వొత్తుల ర్యాలీలకు కార్యకర్తలతోపాటు మహిళా, అభ్యుదయ, ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా విచ్చేసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.