చెత్తను తింటున్న పశువులు ..మృత్యు వాత పడేప్రమాదం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మున్సిపల్ అధికారుల ఉదాసీనత కారణంగా పశువులు మృత్యువాత పడే ప్రమాదం నెలకొందని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆవేదన వ్యక్తం చేసింది. బాగ్ లింగంపల్లి ప్రాంతంలో గోవులు, గేదెలు ఆహారం కోసం మున్సిపల్ చెత్తను తింటున్న వైనాన్ని పలువురు స్థానికులు ఎన్విరాన్మెంట్…కౌన్సిల్ దృష్టికి తీసుకురావడంతో కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య ఆదివారం బాగ్ లింగం పల్లి ఏరియాలో క్షేత్రస్థాయి లో పరిశీలన చేయడంతో… పలు గోవులు రోడ్డుపై పోసిన ప్లాస్టిక్ సంచుల చెత్తలో ఆహారం వెతకడం కనిపించింది. దస్ట్ బిన్లు ఎక్కడా కనిపించక పోవడం పై ఆవేదన వ్యక్తం చేశారు . పశువులు ప్లాస్టిక్ సంచులు తింటున్న ఘటనలు కళ్ళముందు నిరంతరం కనపడుతున్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక డిప్యూటీ కమీషనర్, ఎ ఎమ్ హెచ్ ఓ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించడం తోపాటు పశువుల యజమానులకు అవగాహన కలిగించాలన్నారు. పచ్చదనం, ఆహ్లాదాన్ని పంచాల్సిన సుందరయ్య పార్కు చుట్టూ తీవ్ర స్థాయిలో దుర్గంధం నెలకొందని, గొప్ప నేత, మాజీ ఎంపీ అయిన సుందరయ్య పేరుతో ఉన్న పార్కు ఈ రకమైన ఉదాసీనతకు లోను కావడం అత్యంత బాధాకరమన్నారు. చెత్త సేకరణలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని, అవసరమైన మేర కార్మికులకు సరైన వస్తువులు సమకూర్చడం లేదని రంగయ్య పేర్కొన్నారు. ఈ రకమైన అపరిశుభ్రత పర్యావారణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్న స్పృహ అధికారుల్లో కొరవడటం బాధాకరమన్నారు.