మద్యం కుంభకోణం కేసులో సిసోడియాపై సీబీఐ చార్జిషీటు దాఖలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ మంగళవారంనాడు చార్జిషీటు దాఖలు చేసింది. సిసోడియా పేరును చార్జిషీటులో చేర్చడం ఇదే మొదటిసారి. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ఈ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో సిసోడియా పేరుతో పాటు, ఇదే కేసులో విచారణ ఎదుర్కొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గోరంట్ల పేరును కూడా చేర్చింది. వీరితో పాటు అర్జున్ పాండే, అమన్‌దీప్ దాల్ పేర్లు కూడా ఉన్నాయి.సీబీఐ, ఈడీ నమోదు చేసిన అవినీతి, మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని ఏప్రిల్ 17న ప్రత్యేక కోర్టు పొడిగించింది. చార్జిషీటులో ఉన్న అంశాలపై మే 15న రౌస్ అవెన్యూ కోర్టు ముందు వాదనలు కొనసాగుతాయి.కాగా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా మనీష్ సిసోడియా భార్య సీమ సిసోడియా మంగళవారంనాడు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో ఆమె చేరినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. అటో ఇమ్యూన్ డిజార్డర్‌ కారణంగా ఊపిరితిత్తుల సమస్య తలెత్తిందని, దీంతో ఆమె ఆసుపత్రిలో చేరారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాధి కారణంగా మెదడు క్రమంగా శరీర నియంత్రణను కోల్పోతుందని, ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటున్నారని, కుమారుడు విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారని ఇటీవల కేజ్రీవాల్ సీమ సిసోడియా ఆరోగ్య పరిస్థితిపై చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.