క్షయ వ్యాధి పై యుద్ధం ప్రకటించిన కేంద్రం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: క్షయ(టీబీ).. వ్యాధిపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. ఇన్నాళ్లు చిన్నారులకు మాత్రమే బీసీజీ ఇంజక్షన్ అందించిన కేంద్రం… ఇప్పుడు పెద్దలపైనా దృష్టి సారించింది. క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దీన్ని నిర్దేశించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ఇది అమలవుతోంది. ఇప్పటికే దేశంలో తొలివిడతగా ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ మొదలైంది. తాజాగా మలివిడతలో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో అమలుకానుంది. రాష్ట్ర క్షయవ్యాధి నిర్మూలన విభాగం నోడల్‌ సంస్థగా దీన్ని నిర్వహిస్తోంది. టీబీ వచ్చే అవకాశం ఉందని గుర్తించిన వారికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఇవ్వాలని గుర్తించేందుకు ఆరు కేటగిరీలను నిర్దేశించుకున్నారు.

తెలంగాణలో మొదటి దశలో ఎంపిక చేసిన 17 జిల్లాల్లో గుర్తించిన సుమారు 60 లక్షల మందికి ఒక డోసు టీకా ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. జులై చివరివారం లేదా ఆగస్టు మొదటివారంలో ఇది ప్రారంభం కానుంది. అప్పటి నుంచి మూడు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పిల్లలకు బీసీజీ వ్యాపక్సిన్‌ ఇస్తుండగా 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి ఇవ్వనున్నారు.

పెద్దల టీకా అమలయ్యే జిల్లాలివే..

హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్‌-మల్కాజిగిరి, నాగర్‌ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి.

ఎవరెవరికి అంటే…

60 ఏళ్లు పైబడినవారందరికీ బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్నవారు మద్యం తాగేవారు ఇప్పుడు పొగతాగుతున్నవారు, గతంలో పొగతాగినవారు క్షయవ్యాధిగ్రస్తులకు సన్నిహితంగా ఉన్నవారు గత ఐదేళ్లుగా క్షయ వ్యాధిగ్రస్తులున్న ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులకు ఇంటింటి సర్వేతో గుర్తింపు.

రాష్ట్రంలో పెద్దలకు ఉచితంగా బీసీజీ వ్యాక్సినేషన్‌కు వీలుగా అవసరమైన కార్యాచరణ చురుకుగా సాగుతోంది. ఇప్పటికే వివిధ స్థాయుల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అధికారులు. వీటిని అన్ని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలు, వెల్‌నెస్, వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఇవ్వనున్నారు.. సుమారు 60 లక్షల మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనా. ఎవరెవరికి ఇవ్వాలనేది ఇంటింటి సర్వే ఆధారంగా గుర్తిస్తారు.హెచ్‌ఐవీ బాధితులు, అవయవమార్పిడి చేసుకున్నవారు, గర్భిణులు, బాలింతలు, ఇతర వ్యాక్సిన్‌ల రియాక్షన్‌లు ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా ఇవ్వరు.

Leave A Reply

Your email address will not be published.