చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక కేంద్రం పాత్ర

: అనుమానం వాక్యం చేసిన గంటా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ… చంద్రబాబు అక్రమ అరెస్టు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం పాత్రపై కూడా అనుమానం ఉందని తెలిపారు. చంద్రబాబు ఉన్న జైలులో సెక్యూరిటీపై అనుమానం ఉందని భువనేశ్వరి చెప్పారన్నారు. చంద్రబాబుకి అనుకోని సంఘటనలు ఏమి జరిగినా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జగన్ తన రాజకీయ మరణశాసనాన్ని తానే రాసుకున్నారన్నారు. బాబుని అరెస్టు చేసి.. జగన్ కొరివితో తల గోక్కున్నారన్నారు. శవపేటికకు చివరి మేకు ఆయనకు ఆయనే కొట్టేసు కున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.అవినీతిపరుడు అందలం ఎక్కి రాజ్యాధికారం చేస్తే నీతి మంతులు జైలులో ఉంటారన్నారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అయిన వ్యక్తి జైలులో ఉంచడం అంటే… సూర్య కాంతిని అరచేతితో అపాలని చూడడమే అని అన్నారు. అంతిమ విజయం బాబుదే.. కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు వలన ప్రయోజనం పొందిన అందరూ బయటికి వచ్చి ఐటీ ఉద్యోగులు మెరుపు ప్రదర్శన నిర్వహించారన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు కారణం అంటూ సంఘీభావం తెలిపారని అన్నారు. గొప్ప దార్శనికుడు చంద్రబాబు నాయుడుని జైలులో పెట్టడం బాధాకరమన్నారు. మహిళలు కంట తడి పెడుతున్నారని అన్నారు. చంద్రబాబుని ఒక్క రోజు అయిన జైలులో ఉంచాలి అనే రాజకీయ దురుద్దేశం జగన్‌కు ఉందన్నారు. అధికారులు పీవీ రమేష్, డిజైన్ టెక్ ఎండీ వంటి వారు ఓపెన్ చాలెంజ్ విసిరారని.. చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.